హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల కసరత్తు ప్రారంభం

ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించింది. నార్త్ బ్లాక్‌లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ఏర్పాటు చేసిన సంప్రదాయ ‘హల్వా వేడుక’తో 2024 బడ్జెట్ పత్రాలను సిద్ధం చేసే పక్రియను ప్రారంభించారు. ఈ హల్వా వేడుకలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావ్ కరాద్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ తన చేతులతో హల్వా తీసి అక్కడున్న వారందరికీ పంచారు. భారతీయ సంప్రదాయంలో హల్వా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. బడ్జెట్ పత్రం ముద్రణకు ముందు ఈ వేడుకను నిర్వహించడానికి కారణం ఇదే. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించే వరకు 100 మందికి పైగా ఉద్యోగులు ఆర్థిక మంత్రిత్వ శాఖలో లాక్ అవుతారు. 

వారిని బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. బడ్జెట్ సమర్పించే వరకు వీరంతా ఇంటికి కూడా వెళ్లలేరు.
గత మూడేళ్ల బడ్జెట్ మాదిరిగానే ఈ ఏడాది కూడా 2024 మధ్యంతర బడ్జెట్ కాగిత రహితంగానే ఉండనుంది.
వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లుతో సహా అన్ని బడ్జెట్ పత్రాలు కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్‌లో ఉంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ డాక్యుమెంట్లు ఆండ్రాయిడ్, ఐఒఎస్ ప్లాట్‌ఫామ్‌లలో ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో అందుబాటులో ఉంటాయి. బడ్జెట్‌ను రూపొందించిన తర్వాత నిర్మలా సీతారామన్ సమ్మతితో బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌కు పంపుతారు.

బడ్జెట్ పత్రాలను అత్యంత గోప్యంగా పరిగణిస్తారు. ఈ పత్రాలు లీక్ అవ్వకుండా ఉండటానికి, బడ్జెట్ పత్రం ముద్రణలో పాల్గొనే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని 100 మందికి పైగా ఉద్యోగులు బేస్‌మెంట్‌లోనే ఉండిపోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌ను సమర్పించే వరకు అధికారులు పగలు రాత్రి ఇక్కడే ఉంటారు. ఇంటికి కూడా వెళ్లలేరు. ఈ ఉద్యోగులు అధికారులకు ఫోన్ చేయడం ద్వారా మాత్రమే కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారిని సంప్రదించగలరు. ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు ఉండవు.