అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డులు

అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను (ఒక్కో లడ్డూ 25 గ్రాములు) పంపించనుంది. 

ఈ మేరకు తిరుమలలోని బూందీపొటులో 25 గ్రాముల బరువుతో లక్ష లడ్డూలు తయారీని పొటు కార్మికులు ప్రారంభించారు. సిద్ధమైన లడ్డూలను ట్రేలలో పేర్చి వాహనంలో సేవాసదన్‌కు చేర్చుతున్నారు. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు లడ్డూలు చొప్పున ప్యాకింగ్‌ చేశారు. 

ఇలా మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. ఈ లక్ష లడ్డూలను విమానంలో ఆయోధ్యకు టీటీడీ పంపనుంది. ఈ కార్యక్రమంలో 350 మంది శ్రీవారి సేవకులు, టిటిడి డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీనివాసులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉజ్జయిన్ నుంచి అయోధ్యకు 5 లక్షల లడ్డూలు

అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలు శుక్రవారం బయల్దేరి వెళతాయని ఆలయ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.  ఇప్పటికే 4 లక్షల లడ్డూల ప్యాకింగ్ పూర్తయిందని, మరో లక్ష లడ్డూల ప్యాకింగ్ జరుగుతోందని ఆయన చెప్పారు. ఒక్కో లడ్డూ బరువు సుమారు 50 గ్రాములు ఉంటుందని, మొత్తంగా కలిపి 250 క్వింటాళ్లు ఉంటుందని ఆయన వివరించారు.

శుక్రవారం నాలుగైదు ట్రక్కులలో ఈ లడ్డూలు అయోధ్యకు బయల్దేరి వెళతాయని మహాకాళేశ్వర్ ఆలయ సహాయ నిర్వహాకుడు మూల్‌చంద్ జున్వాల్ తెలిపారు. అయోధ్యలో ఈనెల 22న జరిగే ఆలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో బాబా మహాకాళ్ ప్రసాదంగా లడ్డూలను పంపనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా లడ్డూల తయారీలో 150 మంది ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. లడ్డూల తయారీ కోసం మహాకాళ్ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విభాగం పనిచేసిందని ఆయన చెప్పారు. జనవరి 12న భోపాల్‌లో విలేకరులతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్య మహోత్సవం కోసం ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలను పంపనున్నట్లు తెలిపారు. 

అయోధ్యలో ఆలయాన్ని మొఘల్ రాజు బాబర్ కూల్చివేశాడని, ఇప్పుడు ఆలయాన్ని నిర్మించిన ఈ భుభ సందర్భంలో వేడుకలు చేసుకోవడంలో మధ్యప్రదేశ్ ఎందుకు వెనుకబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 300 టన్నుల అత్యంత నాణ్యమైన బియాన్ని పంపింది.