ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో నిరాధార ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. తాజాగా భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది.
గతేడాది నాలుగవ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86 శాతం తగ్గుదల నమోదయింది. గతేడాది డిసెంబర్లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లను కేవలం 14,910 మందికి మాత్రమే అనుమతులిచ్చినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా తెలిపారు.
అంతకుముందు త్రైమాసికంలో ఆ సంఖ్య 1,08,940గా ఉంది. గతంతో పోలిస్తే ఆ సంఖ్య దాదాపు 86 శాతానికి పడిపోయినట్లు మార్క్ చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పలు యూరప్ దేశాల్లోని కాలేజీలను ఎంచుకొంటుంటారు. ఇక కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే సింహభాగం.
కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకారం 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లలో భారతీయ విద్యార్థుల వాటా ఏకంగా 41 శాతంగా ఉంది. 2022లో ఏకంగా 225,835 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు లభించాయి. అయితే ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యతో కెనడా, భారత్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ