* ఉగ్రవాదంపై దేశాల చర్యలను ఆత్మరక్షణ కోసమన్న భారత్
ఇరాన్ తమ గగనతలాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మంగళవారం తీవ్రంగా హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్ దాడులకు పాల్పడిందని, ప్రతీకార చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇరాన్ దాడులను ఖండించిన పాకిస్థాన్ ఇరాన్ రాయబారిని బహిష్కరించింది. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్కు తిరిగి రావద్దని పేర్కొంది. అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న తమ రాయబారులను పాకిస్థాన్ వెనక్కి పిలిపించింది. ఉన్నత స్థాయి అధికారుల ఇరాన్ సందర్శనను కూడా రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇలా ఉండగా, పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంస్థ ‘జైష్ అల్-అద్ల్’ స్థావరాలపై ఇరాన్ ఇటీవల జరిపిన వైమానిక దాడులను భారత్ పరోక్షంగా సమర్ధించింది. ఈ వ్యవహారం పాకిస్థాన్, ఇరాన్ల మధ్య సమస్యగా పేర్కొని తన వైఖరిని స్పష్టం చేసింది. “భారత్ విషయానికి వస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీలేదు. తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదంపై దేశాలు తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలం’’ అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
More Stories
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు
ఖలిస్థానీ నినాదాలపై కెనడా రాయబారికి సమన్లు
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం