తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఆలయ ప్రతిష్టాపన జరిగాక అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.

తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనున్నారు.

సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లను జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి బయల్దేరే అయోధ్య రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లు జనవరి 29, 31 ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతాయి. అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతాయి.

కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరుతాయి. ఈ రైళ్లు అయోధ్య నుంచి తిరిగి కాజీపేట వస్తాయి.