అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్న వివేక్‌ రామస్వామి

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్‌ ఎన్నికల్లో వివేక్‌ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. 
 
ఇదే సమయంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు.

‘నేను వ్యాపారవేత్తను, రాజకీయ నాయకుడిని కాదు. నా తల్లిదండ్రులు డబ్బులు లేకుండా 40 ఏళ్ల క్రితం ఈ దేశానికి వచ్చారు. నేను బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలను ఏర్పాటు చేశాను. అదే సమయంలో అపూర్వను పెళ్లి చేసుకుని మా ఇద్దరు కొడుకులకు తండ్రినయ్యాను. అది అమెరికన్ డ్రీమ్. కన్జర్వేటివ్స్ అయిన మేం చాలా కాలంగా దేని వైపు నుంచో పరిగెడుతున్నాం. ఇప్పుడు దేని కోసమే పరిగెత్తాల్సిన సమయం వచ్చింది’ అని రామస్వామి ట్వీట్ చేశారు.

దక్షిణ భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఓహియోలో రామస్వామి జన్మించారు. 38 ఏళ్ల ఈ మల్టీ మిలియనీర్ 2024 రిపబ్లికన్ అభ్యర్థి రేసులోకి దూసుకొచ్చారు. యువకుడైన ఆయన తనదగ్గరున్న అపార ఆర్థిక నిధులతోపాటు ధైర్యంగా మాట్లాడుతూ  దూకుడుగా ప్రచారం నిర్వహించారు.

కానీ ఐఓవా కాకస్ ఎన్నికల్లో వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా 51 శాతం ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ట్రంప్‌కు ఆయన మద్దతు పలకాల్సి వచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన రామస్వామి.. “Woke, Inc.” పేరిట రాసిన పుస్తకం రాశారు. ఈ పుస్తకం 2021లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. 
 
దీంతో ఆయన ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఆ పుస్తకంలో కార్పొరేట్ వ్యూహాలను ఆయన విమర్శించారు. డిబేట్లలో దూకుడుగా వ్యవహరిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం రామస్వామి ఫండ్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
తొలి నాళ్లలో వివేక్ పట్ల జనం ఆసక్తి చూపినప్పటికీ క్రమంగా ఆయన వెనకబడిపోయారు. 2023 చివరి నాటికి రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లు వివేక్ రామస్వామిని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారు.  తాను అమెరికా అధ్యక్షుడినైతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సహా ఐదు ప్రభుత్వ సంస్థలను మూసేస్తానని వివేక్ రామస్వామి గతంలో ప్రకటించారు. 
 
ఎఫ్‌బీఐలో అత్యవసరం కాని ఉద్యోగాల్లో ఉన్న 20 వేల మందిని తొలగించి, వారిలో 15 వేల మందికి వేరే విభాగాల్లో ఉద్యోగాలిస్తానని ఆయన చెప్పారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎడ్యుకేషన్‌, న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్‌‌లను మూసేస్తామని ఆయన తెలిపారు. సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానని కూడా వెల్లడించారు.
 
 ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్‌ ఎన్నికల్లో ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌లను వెనక్కి నెట్టి ట్రంప్‌ ముందు వరుసలో దూసుకుపోయారు. దీంతో రెండో స్థానం కోసం రాన్‌ డిశాంటిస్‌, నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. 
 
రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్‌.. రిపబ్లికన్‌ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది. అక్కడ ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తున్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం విశేషం.

ఇక ట్రంప్‌ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020లో డెమోక్రటిక్‌ నేత జో బైడెన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.  అయితే, ఈ సారి ట్రంప్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇటీవలే ట్రంప్‌పై రెండు రాష్ట్రాలు వేటు కూడా వేశాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్‌ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.