ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీని వణికిస్తున్న చలి

దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం ఢిల్లీలోని శివారు ప్రాంతమైన అయా నగర్‌లో మెహ్రౌలి – గుర్గావ్‌ రోడ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గింది. వరుసగా రెండో రోజైన శనివారం రోజు కూడా అత్యంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రాత్రిగా నమోదు కానుంది. చలి, దట్టమైన పొగమంచు పరిస్థితుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ శనివారం (ఐఎండి) రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. 

వాతావరణ పరిస్థితుల రీత్యా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే 18 రైళ్లు 1 నుంచి 6 గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు మంచు వల్ల దృశ్యమానత సరిగ్గాలేకపోవడం వల్ల ఢిల్లీ విమానాశ్రయంలోని పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ప్రధాన వాతావరణ కేంద్రం వద్ద 200 మీటర్ల దృశ్యమానత ఉంది. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. 

శనివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలినాణ్యత స్థాయిలు 365గా నమోదైనట్లు సెంట్రల్‌ కాలుష్య నియంత్రణా బోర్డు (సిపిసిబి) సమాచారం తెలిపింది. ఢిల్లీతోపాటు పంజాబ్‌ రాష్ట్రానికి ఐఎండి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పొగమంచు కారణంగా హర్యానా, చండీగఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.  పంజాబ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని శివారు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కురిసింది.

అలాగే హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేవ్‌, బీహార్‌, అస్సామ్‌, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో కూడా పొగమంచు కురిసిందనిఐఎండి తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. లోడి రోడ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.4 డిగ్రీలు, సఫ్దర్‌జంగ్‌లో 3.6, రిడ్జ్‌లో 3.9 పాలంలో 5.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు ఐఎండి తెలిపింది.