చీఫ్ ఎలక్షన్ కమీషనర్తో పాటు ఎన్నికల సంఘం అధికారుల నియామకానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్లో కేంద్రం కొత్త చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేసిన దావాపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.
కానీ ఆ చట్టానికి ఎంత వరకు చెల్లుబాటు ఉందో అంశాన్ని తెలుసుకునేందుకు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ పాత్ర లేకపోతే, పారదర్శకత లోపిస్తుందని, పాత విధానాన్నే పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సర్వ వ్యవస్థలను కేంద్రం తన గుప్పిట్లో ఉంచుకునే చర్యల్లో ఇదొకటని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ పాత్రను తొలగించడంపై తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
”మేం స్టే ఇవ్వబోవడంలేదు. పార్లమెంటులో చేసిన శాసనంపై మేం స్టే ఇవ్వలేం” అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, ఈ అంశంలో వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి, ఇతరులకు నోటీసులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. ఏప్రిల్ లో నోటీసులు ఇస్తామని తెలిపింది. పిటీషనర్ జయా థాకూర్ తరపున సీనియర్ న్యాయవాది వికాశ్ సింగ్ వాదించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పాత్రను తొలగిస్తూ కేంద్రం డిసెంబరు 28న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐని తొలగించిన కేంద్ర ప్రభుత్వం సీజేఐ స్థానంలో ఓ కేంద్ర మంత్రి ఉండేలా చట్టం రూపొందించింది. కేంద్రం చేసిన చట్టం ప్రకారం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, లోక్ సభలో విపక్ష నేతతో పాటు ఒక కేంద్రమంత్రి కూడా సభ్యుడిగా ఉంటారు.
More Stories
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు
టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు