తమిళనాడులో మరోసారికుండపోతగా వర్షం

తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని 18 జిల్లాల్లో ఆదివారం నుంచి వానలు కురుస్తున్నాయి.  దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
 
నాగపట్నంలో ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షపాతం నమోదయింది.
 
దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి.  ఇటీవల కురిసిన కుండపోత వానలకు చెన్నై నగరాన్ని వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే.  చెన్నైలో ఈ ఉదయం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రోడ్లపైకి నీళ్లు చేరడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
 
కుండపోత వర్షాలు పడుతుండడంతో నాగపట్టిణం, కిల్వేలూర్‌ తాళూకా, కుడ్డలూర్‌, విల్లుపురం, కళ్లకురిచి, రాణిపేట్‌, వెల్లోర్‌, తిరువణ్ణమళైలో అధికారులు స్కూళ్లు, కాలేజీకు సోమవారం సెలవు ప్రకటించారు.  నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
 
మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వచ్చే వారం రోజులు తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.