భారత్‌ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం బాంగ్లాదేశ్ అదృష్టం

భారత్‌ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తెలిపారు. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని ఆమె స్పష్టం చేశారు.  బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది.
ప్రధాని షేక్‌ హసీనా ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ “బంగ్లాదేశ్‌ సార్వభూమ, స్వాతంత్య్ర దేశం. జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. అది సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నా. లేదంటే దేశాభివృద్ధి సాధ్యం కాదు” అని చెప్పారు. 
2009 నుంచి 2023 వరకు తాము అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్‌ ఈ స్థాయికి చేరుకుందని, ప్రజలు నిర్భయంగా ఓటువేసే వాతావరణాన్ని కల్పించామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
“1975 తర్వాత మా కుటుంబాన్ని మొత్తం కోల్పోయినప్పుడు మాకు ఆశ్రయమిచ్చారు” అని ఆమె గుర్తుచేశారు.  ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1975లో జరిగిన పోరులో హసీనా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయారు. దీంతో ఆమె చాలా కాలంపాటు భారత్‌లో జీవించారు. అనంతరం బంగ్లాదేశ్‌కు వెళ్లిన హసీనా అవామీ లీగ్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించారు.
 
కాగా, ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీపై ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని టెర్రరిస్టులతో పోల్చారు. ఆ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులని విమర్శించారు. ఎన్నికలను బహిష్కరించడమే కాకుండా దేశంలో హింసను ప్రోత్సహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కొనసాగాలని వారికి లేదని స్పష్టం చేశారు.

దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ ముగియనున్నది. 27 పార్టీలకు చెందిన 1500 మంది అభ్యర్థులతో పాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.5 కోట్ల మంది మొదటిసారి ఓటువేస్తున్నారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.