రూ. 10,300 కోట్లకు పైగా సైబర్‌ నేరగాళ్లు స్వాహా

ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగాయి. ఓ చిన్న మెసేజ్‌తో ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నుండి ఇప్పటివరకు దేశంలో సుమారు రూ. 10,300 కోట్లకు పైగా నగదనును సైబర్‌ నేరగాళ్లు స్వాహా చేసినట్లు ఓనివేదిక తెలిపింది.  ఈ మొత్తంలో ఏజన్సీలు సుమారు రూ.1,127 కోట్లను బ్లాక్‌ చేయగలిగాయని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి)  తెలిపింది.

సైబర్‌ నేరాలకు సంబంధించి నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సిఆర్‌పి)లో ఐదువేలకు పైగా ఫిర్యాదులు నమోదవుతున్నాయని ఐ4సి సిఇఒ రాజేష్‌ కుమార్‌ తెలిపారు. వీటిలో 40-50 శాతం కంబోడియా, మయన్మార్‌ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. 2021లో 4.52 లక్షలకు పైగా సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదు కాగా, 2022లో 113.7 శాతం పెరిగిందని, పోర్టల్‌లో 9.66 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

2023లో 15.56 లక్షల కేసులు నమోదు కాగా, 2022తో పోలిస్తే వృద్ధి రేటు 60.9 శాతం తగ్గిందని వెల్లడించారు. అంటే లక్ష జనాభాకు 129 సైబర్‌ క్రైమ్‌ కేసులు రికార్డయినట్లు రాజేష్‌ కుమార్‌ తెలిపారు. బాధిత వ్యక్తులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి 1930 కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. 

 మోసం జరిగిన గంటలోపే కాల్‌ చేస్తే బ్యాంకులు నగదును రివకరీ చేస్తాయని పేర్కొన్నారు. యుపిఐ వ్యవస్థను అభివృద్ధి చేసిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహా సుమారు 263 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ హెల్ప్‌లైన్‌కి లింక్‌ చేయబడ్డాయని వివరించారు.