వైసీపీలో దళితుల పైనే ఎందుకు బురద చల్లుతున్నారు?

* సీఎం జగన్ ను ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే బాబు

వైసిపిలో దళితులపైననే ఎందుకు బురద చల్లుతున్నారని తిరుపతి జిల్లా పూతలపట్టు ఎమ్యెల్యే ఎంఎస్ బాబు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఓసీ అభ్యర్థులు ఉన్నచోట ఎక్కడ అభ్యర్థిని మార్చడం లేదని పేర్కొంటూ  తిరుపతి జిల్లాలో మొత్తం దళితులు ఉన్న చోటే అభ్యర్థుల్ని ఎందుకు  మారుస్తున్నారని ఆయన నిలదీశారు.
ప్రజల్లో తనపై ఏమి వ్యతిరేకత ఉందో చెప్పాలని ముఖ్యమంత్రిని అడిగినా సమాధానం చెప్పలేదని ఆరోపించారు. దళితుల మీద బురద చల్లడం సరికాదని పేర్కొంటూ తాను చేసిన తప్పేమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అదేమని అడిగితే సర్వే రిపోర్ట్‌ బాగోలేదని అంటున్నారని ఆయన వాపోయారు. 
 
నీ మీద వ్యతిరేకత ఉందని చెబితే ఏమి వ్యతిరేకత ఉందో చెప్పాలని తాను సిఎం జగన్ ను కోరానని ఆయన వెల్లడించాయిరు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్న వారిలో దళితులే ఎందుకు ఉన్నారని బాబు విస్మయం వ్యక్తం చేశారు.  దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న చోటే ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ విషయంలో సిఎం జగన్ నిర్ణయాన్ని తాము ఎలా ఓర్చుకోగలమని ప్రశ్నించారు. జగన్‌ చేసిందే తాను చేశానని, ఇప్పుడు తన తప్పు ఉందంటే ఎలా అని నిలదీశారు.  మరోవైపు సిఎంతో భేటీ సందర్భంగా జిల్లాను చెప్పు చేతల్లో పెట్టుకున్న ఇద్దరు నాయకులే అంతా చేశారని తానేం తప్పు చేశానని బాబు ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్టు ప్రచారం జరిగింది.
 
దళితుడిని కాబట్టే తనను బలి చేస్తున్నారని ముఖ్యమంత్రి సమక్షంలో అక్రోశం వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. ఎంఎస్‌.బాబు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  నాలుగున్నరేళ్లు నియోజక వర్గాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని తప్పులు చేసిన వారిని వదిలేసి తనను బలిచేయడం ఏమిటని బాబు నిలదీసినట్టు చెబుతున్నారు. మంగళవారం బాబు నేరుగా ముఖ్యమంత్రిని నిలదీస్తూ తాను చేసిన తప్పులు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.