అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం

వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని ఆదేశించింది. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చసింది. 
వేతనాల పెంపు, గ్యాట్యుటీ, ఇతర డిమాండ్లతో గత 23 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించమని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తలపెట్టిన కలెక్టరేట్ల వద్ద బైటాయింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అధికారులు పలు జిల్లాల్లో అంగన్‌వాడీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లోకి చేరకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ ఈ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో, అంగన్‌వాడీలు భగ్గుమన్నారు. ఈ నోటీసులను తగులబెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. నోటీసులను తీసుకోవడానికి పలువురు తిరస్కరించారు.
అంగన్వాడీల సంఘాలతో ఇటీవల చర్చలు జరిపిన ప్రభుత్వ కమిటీ సంక్రాంతి వరకూ సమ్మె వాయిదా వేయాలని కోరింది.  అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, అయితే ఇందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే 11 డిమాండ్‌లకు గాను నాలుగు డిమాండ్‌లను ప్రభుత్వం ఆమోదించి జీవో విడుదల చేసిందని కమిటీ తెలిపింది. 
అంగన్వాడీల ప్రధాన డిమాండ్‌ జీతాల పెంపు, గ్రాట్యుటీల అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు.  మినీ వర్కర్లను పూర్తి స్థాయి కార్మికులుగా పదోన్నతి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించి జీవో విడుదల కాకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నామని అంగన్వాడీ సంఘాలు తెలిపాయి.  అంగన్వాడీలు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించి వినతి పత్రాలను అందించారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను నిలదీస్తూ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు.  అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్‌ల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి.  బుధవారం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇవ్వడంతో రాష్త్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.