కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్ ’ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను ట్రక్కు డ్రైవర్లు విరమించారు. డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు.
చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, కొత్త నిబంధనలపై చర్చలు జరిపిన తర్వాతనే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమణకు ఏఐఎంటీసీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సమ్మె విరమించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఏఐఎంటీసీతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అసోసియేషన్ చైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ పేర్కొన్నారు.
అజయ్భల్లాతో సమావేశం అనంతరం సమ్మె విరమణను ప్రకటించిన ఏఐఎంటీసీ.. ట్రక్కు డ్రైవర్లు తిరిగి విధులకు వెళ్తారని ప్రకటించింది. ‘హిట్ అండ్ రన్’ కేసులకు కఠిన శిక్షలు ప్రతిపాదించడంపై ట్రక్కు డ్రైవర్లు భగ్గుమన్నారు. మూడు రోజుల సమ్మెలో భాగంగా మంగళవారం రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
కొత్త నిబంధనలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో రవాణా కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల ఆందోళనలతో బండ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు.
ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ పోయించుకొనేందుకు భారీగా క్యూలు కట్టారు. అకస్మాత్తు డిమాండ్తో ఉన్న నిల్వ అయిపోవడంతో బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. వాహనదారులు బంకులకు పోటెత్తడంతో.. ఆయా ప్రాంతాల్లో పెద్దయెత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హిట్ అండ్ రన్’ కేసులో అధిక శిక్ష, జరిమానాలకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల్లో డ్రైవర్లు ఆందోళనలు చేపట్టారు.
ఇంధన డిపోల నుంచి బంకులకు ఆయిల్ను సరఫరా చేసే వేలాది మంది డ్రైవర్లు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయానికే చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకొన్నాయి. ఉత్తర, పశ్చిమ రాష్ర్టాల్లో దాదాపు 2 వేల బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
హిమాచల్ప్రదేశ్లో డ్రైవర్ల ఆందోళనల ప్రభావం పర్యాటక రంగంపై పడింది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళనలో పాల్గొనడంతో పర్యాటకులకు వాహనాలు దొరకడం లేదని స్థానిక మీడియా పేర్కొన్నది. డీజిల్ సరఫరా అగిపోతే, పాఠశాల బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందని మహారాష్ట్ర స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ గార్గ్ తెలిపారు.
కాగా, డిమాండ్లను పరిశీలిస్తామన్న స్థానిక అధికారుల హామీ మేరకు మహారాష్ట్రలోని నాసిక్లో డ్రైవర్లు మంగళవారం సాయంత్రం ఆందోళన విరమించారు. రోడ్డు ప్రమాదంలో మరణానికి బాధ్యుడైన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో కొత్తగా చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల రద్దు డిమాండ్తో సోమవారం నుంచి ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు.
More Stories
ఆన్లైన్ వార్తలపై నియంత్రణకు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు!
ఆసియాకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్, శ్రీలంక
భారత్లో ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్ కేసులు