పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌.. మహిళా ఉద్యోగులకు సౌలభ్యం

విడాకులు తీసుకొన్న ఉద్యోగినులు భర్తకు బదులుగా పిల్లలను ఫ్యామిలీ పెన్షన్‌కు నామినేట్‌ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం లేదా రిటైర్మెంట్‌ తర్వాత ఆ వ్యక్తి కుటుంబానికి పెన్షన్‌ మంజూరు చేయాలని సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) రూల్స్‌-2021లోని 50వ నిబంధన స్పష్టం చేస్తున్నది.

ఈ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్‌ మరణానంతరం తొలుత జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్‌ను మంజూరు చేస్తారు. జీవిత భాగస్వామి మరణించాక లేక ఆ వ్యక్తి ఫ్యామిలీ పెన్షన్‌కు పొందే అర్హతను కోల్పోయిన తర్వాత మాత్రమే ఆ కుటుంబంలోని ఇతర సభ్యులు పెన్షన్‌కు అర్హులవుతారు.  కానీ, ఇప్పుడు ఈ నిబంధనలను పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ విభాగం సవరించింది.
విడాకులకు దరఖాస్తు చేసుకున్న లేదా గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్‌ వేసిన ఉద్యోగిని భర్తకు బదులుగా పిల్లలను ఫ్యామిలీ పెన్షన్‌కు నామినేట్‌ చేసుకోవచ్చు. వైవాహిక బంధం తెగిపోయిన పక్షంలో తన భర్తకు బదలుగా తన పిల్లలను లేదా పిల్లలలో ఒకరిని ఫ్యామిలీ పెన్షన్‌కు ఇక నామినేట్ అవకాశం మహిళా ఉద్యోగికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్(డిఓపిపిడబ్లు) ఇప్పుడు సవరించిన నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగి తన భర్తకు బదులుగా తన పిల్లలను కుటుంబ పెన్షన్‌కు నామినేట్ చేసే విధంగా సౌలభ్యం కలిగిస్తుంది.  మహిళా ఉద్యోగి తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా లేక గృహ హింస నిరోధక చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినా లేక ఐపిసి కింద కేసులు వేసినా ఆమె భర్తకు బదులుగా అర్హులైన ఆమె పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయవచ్చని డిఓపిపిడబ్లు కార్యదర్శి వి శ్రీనివాస్ తెలిపారు. 

తమకు అందిన వినతిప్రత్రాలను పరిశీలించిన తర్వాత మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖను సంప్రదించి డిఓపిపిడబ్లు నిబంధనలను సవరించిందని ఆయన చెప్పారు. ఈ సవరణ వల్ల ఫ్యామిలీ పెన్షన్ కేసులలో మహిళా ఉద్యోగులకు సాధికారతను అందచేస్తుందని ఆయన తెలిపారు. 

ఒక మహిళా ఉద్యోగి లేదా పెన్షనర్‌కు తన భర్తతో వైవాహిక సంబంధం తెగిపోయి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన పక్షంలో ఆమె తన భర్తకు బదులుగా తన పిల్లలు లేదా పిల్లలలో ఒకరిని ఫ్యామిటీ పెన్షన్‌కు నామినేట్ చేయవచ్చా అన్న సందేహాలు వ్యక్తం చేస్తూ వివిధ మంత్రిత్వశాఖల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞాపనలు డిఓపిపిడబ్లుకు అందాయని శ్రీనివాస్ చెప్పారు. 

తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉన్న కాలంలో తాను మరణించిన పక్షంలో తన భర్తకు బదులుగా అర్హులైన తన పిల్లలకు లేదా పిల్లలలో ఒకరికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని సంబంధిత కార్యాలయ అధిపతికి లిఖితపూర్వకంగా మహిళా ఉద్యోగి లేదా పెన్షనర్ లేఖను అందచేయవలసి ఉంటుందని ఆయన వివరించారు.