భారత్, పాక్ మధ్య అణు కేంద్రాల జాబితా మార్పిడి

మూడు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ భారత్, పాకిస్తాన్ సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడి చేసుకోవడాన్ని నిరోధించేందుకు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం కింద తమ అణు కేంద్రాల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి.  అణు కేంద్రాల, స్థావరాలపై పరస్పర దాడిని నిషేధించే ఒప్పంద నిబంధనల కిద వరుసగా 31వ సంవత్సరం ఈ జాబితా మార్పిడి జరిగినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని దౌత్యపర వర్గాల ద్వారా ఈ కార్యక్రమం ఏకకాలంలో జరిగినట్లు తెలిపింది.  1998 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం 1991 జనవరి 27 నుంచి కార్యరూపం దాల్చింది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన రెండు దేశాలు ఒప్పందం పరిధిలోకి వచ్చే అణు కేంద్రాలు, స్థావరాల జాబితాను పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది.

కశ్మీరు సమస్య, సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలో రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగింది. జాబితా మార్పిడి మొట్టమొదటిసారి 1992 జనవరి 1న జరుగగా వరుసగా 31వ సంవత్సరంగా ఇప్పుడు జరిగింది.

మరోవంక, పాకిస్తాన్ జైళ్లలో ఉంటున్న భారతీయ పౌరులుగా భావిస్తున్న 356 మంది మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాలని భారత్   పాకిస్తాన్ ను కోరింది. అదే విధంగా భారత పౌరులుగా భావిస్తున్న పాకిస్తాన్ జైళ్లలో ఉంటున్న 182 మంది మత్స్యకారులు, 17 మంది పౌరులకు న్యాయ సేవలు అందేటట్లు చూడాలని కూడా కోరింది.

2008 నుండి ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీలలో పరస్పరం జైళ్లలో ఉంటున్న మత్స్యకారులు, పౌరుల జాబితాలను మార్పిడి చేసుకొనే సంప్రదాయం అనుసరించి భారత్ ఈ జాబితాలను అందించింది. అదే విధంగా భారత దేశంలో నిర్బంధంలో ఉన్న 282 పాకిస్తాన్ పౌరులు, 73 మంది పాకిస్తాన్ మత్స్యకారుల జాబితాను కూడా భారత్ అందించింది.