
ఇప్పటికే సీతారాం ఏచూరి వంటి కొందరు నేతలు ఈ కార్యక్రమంపై హాజరుకాబోమని ప్రకటించినా కీలక నేతలు మౌనం వహిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయం 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా? అని మీడియా ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఈ సందిగ్ధతను స్పష్టం చేశాయి.
‘మీరు వెళితే మీరు బీజేపీ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారని అర్థం. మీరు వెళ్లకపోతే మీరు హిందు వ్యతిరేకులు. ఇది అర్థం లేనిది. వ్యక్తులను ఆహ్వానించారు. వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకోనివ్వండి. నేను గుడిని రాజకీయ వేదిక అనుకోను. రాజకీయ కార్యక్రమానికి వెళ్లకపోవడం మిమ్మల్ని హిందూ వ్యతిరేకిని చేయదు’ అని ఆయన చెప్పడం కాంగ్రెస్ పార్టీలోని గందరగోళాన్ని వెల్లడి చేస్తుంది.
ఈ అంశంపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమని కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. అయితే రామ మందిరం ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న బీజేపీకి విపక్షాల నిర్ణయం వల్ల కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. మత విశ్వాసాలను రాజకీయికరణ చేశారణ విమర్శిస్తూ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే తరహా అభిప్రాయంతో ఉన్నా తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ‘ఇవన్నీ రాజకీయాలు. బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఎవరు కోరుకుంటారు? ఇదేమీ జాతీయ కార్యక్రమం కాదు. బీజేపీ కార్యక్రమం అయ్యాక మేము అయోధ్యను సందర్శిస్తాం’ అని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోయినా ఎన్నికల పరంగా ఎక్కువ నష్టం కలగకుండా ఉండేలా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోతే ఉత్తరాదిలో ఓట్లు రావేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నదని కేరళ జెమ్-ఇయ్యాతుల్ ఉలమా(సంస్థ) విమర్శించింది.
రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ బృందం వెళ్లే ఛాన్సు ఉన్నట్లు ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. కానీ సోనియా గాంధీ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ అంశంలో ఆమె సానుకూలంగా ఉన్నట్లు దిగ్విజయ్ చెప్పారు. పార్టీ వైఖరి ఏంటన్న అంశం త్వరలోనే తెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
అయితే మందిరం ప్రారంభోత్సవానికి హాజరవ్వాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోవడం పార్టీలకు కానీ, వ్యక్తులకు కానీ అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామ మందిరం రాజకీయ ఉద్యమంతో ముడిపడిన అంశం. దీనిపై పార్టీలు లేదా నాయకులు తీసుకొనే నిర్ణయాలను ఎన్నికల పరిణామాలతో కూడిన రాజకీయాల కోణంలో చూసే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
More Stories
సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కాంగ్రెస్కు అర్థం కావట్లేదు
త్వరలోనే జీఎస్టీ రేట్లు, శ్లాబ్లు తగ్గింపు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం