భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవలే ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ను సస్పెండ్ చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దాని వ్యవహారాలను చూసుకునేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆధ్వర్యంలో ‘అడ్ హక్ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఐవోఏ ముగ్గురు సభ్యులతో కూడిన అడ్ హక్ కమిటీని ప్రకటించింది.
ఈ కమిటీకి భూపిందర్ సింగ్ బజ్వా చైర్మన్గా వ్యవహరించనున్నారు. భూపీందర్ సింగ్ గతంలో కూడా డబ్ల్యూఎఫ్ఐ అడ్ హక్ కమిటీకి చీఫ్గా పనిచేశారు. ఐవోఏ నియమించిన కమిటీలో భూపీందర్ సింగ్ బజ్వాతో పాటు ఎంఎం సౌమ్య, మంజూష కన్వర్లు ఉన్నారు. మళ్లీ కొత్త పాలకవర్గం వచ్చేదాకా డబ్ల్యూఎఫ్ఐలో అడ్హక్ కమిటీయే దైనందిన వ్యవహారాలను చూసుకుంటుంది.
ఈ ఏడాది యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) డబ్ల్యూఎఫ్ఐలో నిర్దేశిత కాలంలో ఎన్నికలు నిర్వహించనందున భారత రెజ్లింగ్ సంఘంపై నిషేధం విధించింది. ఈ క్రమంలో క్రీడా మంత్రిత్వ శాఖ అడ్ హక్ కమిటీని నియమించగా ఆ కమిటీలో కూడా భూపీందర్ ఉన్నారు. మూడు రోజుల క్రితమే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో గెలిచిన సంజయ్ సింగ్ ప్యానెల్ను సస్పెండ్ చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషాను అడ్హక్ కమిటీ చైర్మన్గా ఉండాలని కోరినా ఆమె మాత్రం విముఖత వ్యక్తం చేశారు.
డబ్ల్యుఎఫ్ఐలో న్యాయమైన, జవాబుదారీతనం, పారదర్శకత్వాన్ని నిర్థారించడానికి ఈ అడహక్ కమిటీని నియమించినట్లు ఐఒఎ తెలిపింది. డబ్ల్యుఎఫ్ఐకి ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు, అధికారులు రెజ్లింగ్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారని ఐఒసి చీఫ్ పిటి.ఉషా ఓ లేఖలో పేర్కొన్నారు.
ఐఒసి ప్రతిపాదించిన సుపరిపాలన సూత్రాలకు వ్యతిరేకంగా, తగిన ప్రక్రియను అనుసరించ కుండా నియంతృత్వంగా వ్యవహరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజరు సింగ్ డబ్ల్యుఎఫ్ఐ చీఫ్గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికలపై రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లింగ్కు సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా, మరో రెజ్లర్ బజరంగ్పూనియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసం నుండే డబ్ల్యుఎఫ్ఐ కార్యాలయం పనిచేస్తోందని వినేష్ ఫోగట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
More Stories
పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
పోలింగ్కు ముందు 48 గంటలు అత్యంత కీలకం