వాళ్లు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి కఠినంగా శిక్షిస్తాం

భారత్‌కు వచ్చే వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  వెల్లడించారు. వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. నౌకలపై దాడులకు పాల్పడిన వారు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ ను ముంబై వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగింది. 
21 మంది భారత నౌకా సిబ్బందితో ఉన్న ఈ నౌక పోర్‌బందర్‌కు 217 నాటికల్ మైల్స్ దూరంలో ఆగిపోవడంతో భారత నౌకాదళం వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబై పోర్టు ప్రాంతానికి చేరుకుంది. కాగా, అమెరికాకు చెందిన వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని పెంటగాన్‌ ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. 

దీనికి ముందు ఎంవీ సాయిబాబా వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. కాగా, మర్చెంట్ షిప్‌లపై కౌంటర్ పైరసీ, డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు నాలుగు డిస్ట్రాయర్లను మోహరించినట్టు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.రవికుమార్ తెలిపారు.  ఈ పరిణామాల నడుమ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.