క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన మూడు క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లులు చట్టాలుగా మారాయి. గత వారం వీటికి పార్లమెంటు ఆమోదం తెలిపింది.
 
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్ లకు ప్రత్యామ్నాయంగా ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయడంతో బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. 
తర్వాత బిల్లులను సవరించి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో సభ ముందుకు తెచ్చింది.
ఈ బిల్లులను గతవారం పార్లమెంట్ ఆమోదించి పంపగా తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి.  ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.
దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్​లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. అంతేగాక, రాజద్రోహాన్ని నేరాల నుంచి రద్దు చేశారు. బ్రిటిష్ పాలకుడిని సూచించే రాజద్రోహానికి బదులుగా దేశద్రోహం అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు. ‘రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలు’ పేరుతో కొత్త సెక్షన్‌​ను అమర్చారు.
 
 వేర్పాటు చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, సార్వభౌమాధికారం లేదా ఐక్యతకు విఘాతం కలిగించడం వంటి నేరాలను ఇందులో చేర్చారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జీవితఖైదు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనను ఇందులో పొందుపర్చారు.
ఈ నూతన చట్టాల ప్రకారం, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లేదా తెలిసి, పదాలు, మాట్లాడటం లేదా వ్రాసిన, లేదా సంకేతాల ద్వారా, లేదా కనిపించే ప్రాతినిధ్యం ద్వారా, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా లేదా ఆర్థిక మార్గాలను ఉపయోగించడం ద్వారా లేదా వేర్పాటు లేదా సాయుధ తిరుగుబాటును ఉత్తేజపరిచేందుకు లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించినా,  లేదా విధ్వంసకర కార్యకలాపాలు, లేదా వేర్పాటువాద కార్యకలాపాల భావాలను ప్రోత్సహించడం లేదా భారతదేశ సార్వభౌమత్వం లేదా ఐక్యత,  సమగ్రతకు హాని కలిగించడం లేదా అలాంటి ఏదైనా చర్యకు పాల్పడడం లేదా పాల్పడడం వంటివి చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. జరిమానా కూడా విధించబడుతుంది. 
కాగా, నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడమే కొత్త చట్టాల లక్ష్యమని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్​లో కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత బిల్లులను రూపొందించినట్లు తెలిపారు. సభ ఆమోదం కోసం తీసుకొచ్చే ముందు బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తాను పరిశీలించినట్లు అమిత్ షా వెల్లడించారు. తాజా చట్టాలతో బ్రిటీష్ కాలం నాటి పాత చట్టాలు కనుమరుగు కానున్నాయి. కొత్త చట్టాలతో భారతదేశంలో నవశకం ప్రారంభం కానుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.