ఏపీలో నిరసనలకు సిద్దమవుతున్న వాలంటీర్లు

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కీలకమైన వాలంటీర్లు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి పలు జిల్లాల్లో వీరు నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 
 
కొన్ని జిల్లాల్లో వీరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న సాటివేతనం కూడా తమకు ఇవ్వడం లేదని అంటున్నారు. ఈనెల 23న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, కర్నూలు జిల్లా హొళగుంద, మన్యం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తదితర ప్రాంతాల్లో వాలంటీర్లు ఈనెల 26 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు మండల పరిషత్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.
 
మిగతా జిల్లాల్లోనివారు బయటకు రాకపోయినా  ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. వాలంటీర్లకు చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ విషయం వైరల్ అవుతోంది. సమ్మె చేసేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం’ ఆంధ్రా కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 
 
వాలంటీర్లకు అధికార పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఆందోళన అవసరం లేదని,  ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే కొందరు వాలంటీర్లు వెనక్కు తగ్గడం లేదు.  వాలంటీర్లు  నిరసనలు, సమ్మెను కొనసాగిస్తే పింఛన్ల పంపిణీ పరిస్థితి ఏంటి? పంపిణీ ఎలా? అనేది చూడాలి. 
 
వాలంటీర్లలో కూడా ఎక్కుశాతంమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే కావడంతో వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, సమ్మెకు సిద్దం కావడం తలనొప్పిగా మారింది.  జగన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబరులో నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. 
 
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు. సీఎం జగన్‌ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు. అయితే ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని గౌరవ వేతనం పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న అసంతృప్తి వాలంటీర్లలో మొదలైంది.