భారతీయ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

హిందూ మహాసముద్రంలో  శనివారం భారత్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది.  ఈ దాడిలో పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. వాణిజ్య నౌకలో ఉన్న 20 మంది భారతీయులను కోస్తా గార్డు నౌక కాపాడింది.  గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో వాణిజ్య నౌక ఎంవి కెమ్ ప్లూటోపై డ్రోన్ దాడి జరిగింది. 

దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలు ఉన్న ట్యాంకర్‌ పేలి మంటలు వ్యాపించినట్లు ఆంబ్రే వెల్లడించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వాటిని అదుపు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది. నౌకకు మాత్రం నష్టం వాటిల్లినట్లు తెలిపింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరు రేవుకు ముడి చమురును తీసుకువస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగి, నౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. 

భారతీయ ప్రత్యేక ఆర్థిక మండలిని గస్తీ కాస్తున్న కోస్తా గరుడ నౌక సిజిఎస్ విక్రమ్ వెంటనే వాణిజ్య నౌక వద్దకు చేరుకుని సిబ్బందిని రక్షించడంతోపాటు మంటలను అదుపులోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. సహాయం కోసం సమీపంలోని అన్ని నౌకలు అక్కడకు చేరుకోవాలని కూడా కోస్తా గార్డు నౌక కోరింది. 

లైబీరియా జెండాతో ఉన్న రసాయన ఉత్పత్తుల ట్యాంకర్‌ ఇజ్రాయెల్ అనుబంధ నౌక అని ఆంబే తెలిపింది. ఈ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరు వస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని వెరావల్‌కు నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించింది.

కాగా గత సోమవారం మాల్టాకు చెందిన ఒక రవాణా నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి హైజాక్ చేయగా గాయపడిన ఒక నావికుడిని భారతీయ నేవీ కాపాడిన నేపథ్యంలో ఈ డ్రోన్ దాడి ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరుగురు దోపిడీ దొంగలు అరేబియా సముద్రంలో రవాణా నౌక ఎంవి రుయెన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి.