అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసిఆలయ గోడలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం వెలుపల ఉగ్రవాదులకు, వేర్పాటువాద శక్లుకు అటువంటి అవకాశం లభించకూడదని ఆయన స్పష్టం చేశారు.
శనివారం గాంధీనగర్ లో రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ మూడవ స్నాతకోత్సవానికి హాజరైన జైశంకర్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆ వార్తలు తాను కూడా చూశానని, అటువంటి ఘటనలపై తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు. అక్కడి భారత కాన్సులేట్ ఇప్పిటకే ఘటనపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని, జరిగిన ఘటనపై పోలీసుల నుంచి సమాచారాన్ని తీసుకుందని ఆయన తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. కాగా, శ్రీ స్వామినారాయణ్ మందిరాంలో విధ్వంసకాండ జరిగినట్లు శుక్రవారం ఉదయం 8.35 గంటల ప్రాంతంలో తమకు ఫోన్ వచ్చినట్లు కాలిఫోర్నియాలోని నెవార్క్ పోలీసులు తెలిపారు.
‘స్వామి నారాయణ్ దేవాలయ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీని నేను చూశాను. తీవ్రవాదులు వేర్పాటువాదుల వంటి శక్తులకు చోటు ఇవ్వకూడదు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాం. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులకు విజ్ఞప్తి చేశాం.’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, నెవార్క్లోని స్వామి నారాయణ ఆలయ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతోపాటు ప్రధాని మోడీ వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్లో పోస్టు చేసింది. గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్వాలే పేరు రాశారు.
ఈ రాతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తాయి. ఇది విద్వేషాలను రెచ్చగొట్టే చర్యల కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తుల చేయాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్లో కోరింది. సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోల ప్రకారం ఆలయం వెలుపల ఉన్న సైన్బోర్డుపై ఖలిస్తాన్ అన్న రాతలతోపాటు ఆలయ గోడలపై అభ్యంతరకర రాతలు ఉన్నాయి.
విద్వేషంతో కాని పక్షపాతంతోకాని బెదిరింపులకు, హింసకు, ఆస్తుల ధ్వంసానికి, వేధింపులకు లేదా నేరాలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని నెవార్క్ పోలీసులు స్పష్టం చేశారు. ఆలయాన్ని అపవిత్రం చేసిన ఘటనను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది.
అమెరికాలో నివసిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పట్వంత్ సింగ్ పన్నున్ను హత్య చేయడానికి ఒక భాతతీయ అధికారితో కలసి కుట్రపన్నారన్న ఆరోపణపై జెక్ రిపబ్లిక్లో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్టు చేయడం గురించి జైశంకర్ మాట్లాడుతూ ఆ దేశంలో భారతీయ ఎంబసీ ద్వారా గుప్తాకు న్యాయ సహాయాన్ని అందచేసినట్లు చెప్పారు.
10వ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో అమెరికా, కెనడా పేర్లు ఆహ్వాన జాబితాలో లేకపోవడంపై ప్రశ్నించగా దీనిలో రాజకీయ అర్థాలు వెదక వలసిన అవసరం లేదని జైశంకర్ సూచించారు. ఎవరిని ఆహ్వానించాలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, దీనిపై గుజరాత్ ప్రభుత్వమే సమాధానం చెబుతుందని ఆయన తెలిపారు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్