తెలంగాణాలో 6 కరోనా కొత్త కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. నిన్న నాలుగు పాజిటివ్ కేసులు నమోదవగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 14కి చేరింది. ఇదిలా ఉంటే, ఈ 24 గంటల్లో కరోనా బారిన పడిన ఒకరు ప్రాణాలు వదిలారు. ఈ కేసులన్నీ హైదరాబాద్ పరిదిలోనే ఉన్నాయి. 
 
ఈమేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. నిన్నటి వరకు అటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కొత్త వేరియంట్ వ్యాప్తి జరుగుతుందని వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా ఓ మృతి కూడా నమోదవటంతో జనాల్లో కలవరం మొదలైంది.
 
 కరోనా  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సిబ్బందిని ఆదేశించారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కరోనా సన్నద్ధతపై బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా అందులో పాల్గొన్న మంత్రి అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. 
 
గురువారం రోజున అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఆసుపత్రులకు అవసరమైన డీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ ద్వారా తీసుకోవాలని చెప్పారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే కరోనా పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. పాజిటివ్‌ వచ్చిన కరోనా నమూనాలను విధిగా ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీకి పంపాలని ఆదేశించారు.
కాగా,  రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు కేవలం 0.31 శాతంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసుల్లో రికవరీ రేటు 99.51శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.  కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.