27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు

సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన మధ్యంతర పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.  మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.  దీంతో, డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాయి. అయితే, ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. 

కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధ‌న శాఖ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డ హైకోర్టు ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2017లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘ‌మైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తొమ్మిది డివిజన్లలో విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఆవిర్బవించింది. 

సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంఘం పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 2017 ఎన్నికల సమయంలో కాల పరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత అందించే గెలుపు పత్రంలో మాత్రం రెండేళ్ల కాల పరిమితి అని అందజేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గడువు 2019 సెప్టెంబర్‌లో ముగిసింది. రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు.