లోక్‌సభ అలజడి కేసులో మాజీ పోలీస్ అధికారి కుమారుడు !

* సీఐఎస్ఎఫ్ చేతుల్లోకి పార్ల‌మెంట్ భ‌ద్ర‌త

శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ స్మోక్‌ వెదజల్లడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన టెకీ  కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌కు చెందిన అతుల్‌గా గుర్తించారు.  ఆ ఇద్దరిలో టెకీని కర్ణాటకలోని బాగల్‌కోట్‌ కు చెందిన రిటైర్డ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కుమారుడు సాయికృష్ణగగా గుర్తించారు.  డిసెంబర్‌ 13న లోక్‌సభ చాంబర్‌లోకి చొరబడిన మనోరంజన్‌కు సాయికృష్ణ స్నేహితుడు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

సాయికృష్ణ, మనోరంజన్‌లు బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బ్యాచ్‌మేట్స్‌గా గుర్తించినట్లు వెల్లడించాయి.  ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాయికృష్ణను ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాగల్‌కోట్‌లోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సాయికృష్ణను ఢిల్లీకి తీసుకొచ్చారు.

కాగా, పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన నిందితుల్లో లోక్‌సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మ, పార్లమెంటు వెలుపల పొగ డబ్బాలు ఉపయోగించిన అమోల్ షిండే, నీలం ఆజాద్‌లు ఉన్నారు.  లలిత్ ఝా భద్రతా ఉల్లంఘనకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.

లలిత్‌తోపాటు అతనికి సాయం చేసిన మహేష్ కుమావత్‌ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  కాగా,సాగ‌ర్ శ‌ర్మ‌, మ‌నోరంజ‌న్, నీలం దేవి, అమోల్ షిండేకు జ‌న‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు పోలీసు క‌స్ట‌డీని పొడిగిస్తున్న‌ట్లు స్పెష‌ల్ జ‌డ్జి హ‌ర్దీప్ కౌర్ గురువారం తెలిపారు.

మరోవంక, పార్ల‌మెంట్‌లో భ‌ద్ర‌త‌ను ఇక నుంచి సీఐఎస్ఎఫ్  చూసుకోనున్న‌ది. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్య ఘ‌ట‌న చోటుచేసుకున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ చర్య తీసుకున్న‌ది. పార్ల‌మెంట్ ఇక నుంచి కేంద్ర బ‌ల‌గాల చేతుల్లోకి వెళ్ల‌నున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ పోలీసులు పార్ల‌మెంట్ భ‌ద్ర‌త అంశాన్ని చూసుకునేవారు.

అయితే గ‌త వారం లోక్‌స‌భ‌లోకి ఇద్ద‌రు వ్య‌క్తులు వెళ్లి స్మోక్ అటాక్‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో క‌ల‌ర్ క్యాన్ల‌తో అల‌జ‌డి సృష్టించారు. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా మార్పుపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది.  భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై ప్ర‌ధాని, హోంమంత్రి ప్ర‌క‌ట‌న చేయాల‌ని కోరుతూ పార్ల‌మెంట్ విప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే.

పార్ల‌మెంట్‌లోకి ప్ర‌వేశించే వారిని సీఐఎస్ఎఫ్ ద‌ళాలే ఫ్రిస్కింగ్ చేస్తాయి. పార్ల‌మెంట్ కాంప్లెక్స్ భ‌ద్ర‌తా బాధ్య‌త మొత్తం లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ చేతుల్లో ఉంటుంది. ఉన్న‌త స్థాయి క‌మిటీ చేసిన సూచ‌న ప్ర‌కారం భ‌ద్ర‌త‌ను సీఐఎస్ఎఫ్‌కు అప్ప‌గించారు.

కాగా.. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే భద్రత, అగ్నిమాపక చర్యలపై సర్వే నిర్వహించాలని పారిశ్రామిక భద్రతా దళం డీజీని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించింది. రోజువారీ భద్రతా పర్యవేక్షణకు సంబంధించిన సిబ్బంది మోహరింపుపై సర్వే చేయాలని కేంద్రం పేర్కొంది. సర్వే తర్వాత స్పీకర్‌తో చర్చించి భద్రతను తమ అధీనంలోకి  సీఐఎస్ఎఫ్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.