నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు దేశావ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు జరిగాయి. ఐసిస్కు చెందిన 8 మంది ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దాంతో దేశవ్యాప్తంగా మందుపాతరలు పేల్చి భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు; మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె; జార్ఖండ్లోని జంషెడ్పూర్, బొకారోలతోపాటు దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరిగాయి. మహారాష్ట్రలోని 40, కర్ణాటకలో 11, జార్ఖండ్లో నాలుగు కేంద్రాల్లో దాడులు జరిపారు.
మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే ఉగ్రవాది నేతృత్వంలో దేశంలో పేలుళ్లకు కుట్ర జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అరెస్టయిన 8 మంది ఉగ్రవాదుల్లో వారి నాయకుడు మహ్మద్ సులేమాన్ కూడా ఉన్నాడు. పట్టుబడిన ఉగ్రవాదుల పేర్లను ఎన్ఐఏ వెల్లడించింది. వారిలో మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్, సయ్యద్ సమీర్ ఇద్దరూ బళ్లారిలో పట్టుబడ్డారు. అనాస్ ఇక్బాల్ షేక్ ముంబైలో దొరికాడు. మహ్మద్ మునీరుద్దీన్, సయీద్ సమీయుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజామిల్ బెంగళూరులో అధికారులకు చిక్కారు.
షయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫికర్ అలియాస్ గుడ్డూను జంషెడ్పూర్లో అరెస్ట్ చేశారు. దేశంలో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ కుట్ర చేస్తున్నదని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందగానే 19 ప్రాంతాల్లోగల ఆ ఉగ్రవాద నెట్వర్క్లోని అనుమానితుల ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు రైడ్స్ చేశారు. కర్ణాటకలోని 11 ప్రాంతాల్లో, జార్ఖండ్లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి.
More Stories
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు