కాంగ్రెస్ స్కామ్‌ల ఫలమే జార్ఖండ్ సొమ్ము

కాంగ్రెస్ స్కామ్‌ల ఫలమే జార్ఖండ్ సొమ్ము

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ స్కామ్‌లకు జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపి అక్రమ లావాదేవీలకు విడదీయని బంధం ఉందని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. మద్యం , బొగ్గు, వీటికి తోడుగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ వంటి భారీ కుంభకోణాలకు జార్ఖండ్‌తో లింక్ ఉందని, కాంగ్రెస్ ఎంపి నివాసంలో దొరికిన రూ 353 కోట్ల నగదుకు, ఈ స్కామ్‌లకు అవినాభావ సంబంధం ఉందని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అవినీతి పనులకు, దొరుకుతున్న నల్లధనం నిల్వలకు లింక్ ఉందని పేర్కొంటూ ఇందుకు పలు ఉదాహరణలు ఉండనే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సర్వదా అక్రమ అవినీతి పనులకు దిగుతుంటారని, అందుకే వీరు నల్లధనం మూటలను కాపాడుకోవడానికి నానా విధాలుగా యత్నిస్తుంటారని కేంద్ర మంత్రి విమర్శించారు. 

దేశంలో పెద్ద నోట్ల రద్దును కాంగ్రెస్ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది ఇందుకే అని అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.  పైగా తమ అక్రమాలు ఎక్కడ బయటపడుతాయనే భయంతోనే కాంగ్రెస్ నేతలు తరచూ ఇడి, సిబిఐలపై మంటతో మాట్లాడుతుంటారని మండిపడ్డారు.  బిలాస్‌పూర్‌లో కేంద్ర మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒడిషాకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేటు లిమిటెడ్ జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి ధీరజ్ సాహూ కుటుంబానిదని, అక్కడ విపరీత స్థాయిలో నగదు, బంగారం దొరికిన విషయాన్ని గుర్తించాల్సి ఉందని తెలిపారు. 

దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఐటి దాడులలో ఇంత భారీ మొత్తం దొరకలేదని స్వయంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులే చెప్పిన విషయాన్ని ఈ దశలో కేంద్ర మంత్రి ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా ఈ పార్టీ నేత నుంచి రూ 42 కోట్లు స్వాధీనపర్చుకున్నారని గుర్తు చేశారు. అవినీతిపరుల కాంగ్రెస్ జాడలు ఐటి, ఇడి దాడులలో వెలుగులోకి వస్తున్నాయని విమర్శించారు.