మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో తుపాకులు గర్జించాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బోధిన్తులా వద్ద మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. ఈ ప్రాంతం గడ్చిరోలి ఔట్పోస్టుకు సమీపంలో ఉంది. దీంతో గడ్చిరోలి ఔట్పోస్టును పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఆ తర్వాత క్యాంపును రౌండప్ చేసే సమయంలో పోలీసుల కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. దీంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల మోతతో గడ్చిరోలి దద్దరిల్లి పోయింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతమయ్యారు. మృతులలో 2019లో జంబుల్ఖేడా పేలుడుతో సంబంధమున్న సీనియర్ నక్సల్ నాయకుడు కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు.
జంబుల్ఖేడా పేలుడులో 15 మంది గడ్చిరోలి పోలీసు సిబ్బంది మరణించారు. ఈ పేలుడుకు కారణమైన కన్సూర్ దళానికి చెందిన దిప్యూటీ కమాండర్ దుర్గేష్ వట్టి మరణించిన ఇద్దరు నక్సల్స్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. మరో మావోయిస్టు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. గొడల్వాహి ఔట్పోస్టు సమీపంలో ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బోధిన్తల వద్ద పెద్ద సంఖ్యలో నక్సల్స్ బస చేసినట్లు తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, పోలీసు బృందంపై మెరుపుదాడి జరపాలని కుట్రపన్నారని జిల్లా ఎస్పి నీలోత్పల్ తెలిపారు.
పోలీసులు గాలింపు సాగిస్తుండగా నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని, దాదాపు గంటసేపు సాగిన కాల్పుల పోరు అనంతరం ఇద్దరు నక్సల్స్ మృతదేహాలు అక్కడ కనిపించాయని ఆయన చెప్పారు. వారి నుంచి ఒక ఎకె 47 రైఫిల్తోపాటు ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ లభించినట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా