ఏపీలో దొంగ ఓట్లపై  ఎన్నికల కమిషన్ కు బిజెపి ఫిర్యాదు

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పక్షం పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పిస్తూ ఉండటంపై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి డి.  పురంధేశ్వరి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. 

అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా ఏపీలో ఓటర్ల జాబితా టాంపరింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో సీఈసీని కలిశామని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35 వేలు డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘానికి ఇచ్చామని పురంధేశ్వరి వెల్లడించారు. 

తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 35 వేల మంది నకిలీ ఓట్లు వేశారని, అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61వేల ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం నార్త్‌లో ఇంటింటి సర్వే చేయగా 2 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61 వేల మంది ఓట్లు జత చేశారని ఆమె విమర్శించారు. 

దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని, కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని ఆమె తెలిపారు. ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. కాగా,  వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పురంధేశ్వరి ఆరోపించారు.  ఇలా ఉండగా, ఇటీవల తుఫాన్ కారణంగా రైతులు పంట నష్టపోయారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

వరి పంట నష్టం నిమిత్తం హెక్టారుకు రూ.30 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ.10 లక్షలు ఇవ్వాలని  ఆమె కోరారు. అసలు రైతులను ఆదుకోవాలనే విధానం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారో, ఏం పైరవీలు చేస్తున్నారో అంటూ ఆమె ధ్వజమెత్తారు. మిచౌంగ్ తుపానును జాతీయవిపత్తుగా ప్రకటించాలని కోరామని ఆమె తెలిపారు. 

కాగా, బాధిత రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కార్పెట్ వేసుకుని పరామర్శిస్తారా? అని ఆమె ఎద్దేవా చేశారు. ఆలుగడ్డకు.. ఉల్లిగడ్డకు తేడా తెలియని మనిషి సీఎం జగన్ అని పురంధేశ్వరి దుయ్యబట్టారు. డిమాండ్ల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను అణచివేయడం దారుణమని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంగన్వాడీ కార్యకర్తలకూ ఓ రోజు వస్తుంది.. ఆరోజు వాళ్లంటే ఏంటో చూపిస్తారని ఆమె హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపమే.. ఏపీ ప్రజల ఇబ్బందులకు కారణమని ఆమె ధ్వజమెత్తారు. ఏపీలో మార్పు మొదలైందని.. జగన్ సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు.