ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం

ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో ఓ విశిష్టమైన స్థానం సంపాదించిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే టీ20 వరల్డ్ కప్ గెలిచారు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ సాధించాడు. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ సృష్టించారు.  భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆట‌కు వీడ్కోలు ప‌లికి మూడేండ్లు దాటింది. 
జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ ఇప్పుడు కేవలం ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ గౌరవార్థం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.   దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మ‌హీ భాయ్‌కు భార‌త క్రికెట్ బోర్డు అరుదైన గౌర‌వం క‌ల్పించింది. 
అత‌డు ధ‌రించిన ఏడో నంబ‌ర్ జెర్సీకి వీడ్కోలు ప్ర‌క‌టించింది. ఇక‌పై ధోనీ జెర్సీ నంబ‌ర్‌ని ఎవ‌రికి కేటాయించ‌కూడ‌ద‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. అంటే ఈ జెర్సీ ధరించి భారత క్రికెటర్ ఎవరూ ఇక మీద అంతర్జాతీయ క్రికెట్ ఆడబోరన్నమాట.  ఇప్పటి వరకూ ఈ గౌరవం సచిన్ టెండుల్కర్‌కు మాత్రమే దక్కింది.  దాంతో, లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా ధోనీ రికార్డుకెక్కాడు.
ప‌దో నంబ‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగిన స‌చిన్ ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌రుగుల వీరుడిగా అవ‌త‌రించాడు.  అత‌డు రిటైర్మెంట్ ప‌లికిన అనంతరం బీసీసీఐ 10వ నంబ‌ర్‌ను ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది.  భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవం కట్టబెట్టింది. 
 
ఏడో నెంబర్ జెర్సీని ఎంపిక చేసుకోవద్దు అని యువ ఆటగాళ్లు, ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. దీంతో ఇక మీద భారత జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకోలేరు.
 
‘ఎంఎస్ ధోనీ ఏడో నంబ‌ర్ జెర్సీని ఎవ‌రూ ఎంచుకోవ‌ద్ద‌ని ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్లు, యంగ్‌స్ట‌ర్స్‌కు చెప్పాం. భార‌త క్రికెట్‌కు ఎన‌లేని గుర్తింపు తెచ్చిన మ‌హీ జెర్సీకి వీడ్కోలు ప‌ల‌కాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించ‌డ‌మే అందుకు కార‌ణం. ఇక‌పై కొత్త ఆట‌గాళ్లు నంబ‌ర్ 7 జెర్సీని ధ‌రించ‌లేరు’  అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
`ఇప్ప‌టికే 10వ నంబ‌ర్ జెర్సీని ప‌క్క‌న పెట్టేశాం. ప్ర‌స్తుతానికి ఆట‌గాళ్ల కోసం 60 సంఖ్య‌లు ఉన్నాయి. ఒక‌వేళ ఏ ప్లేయ‌ర్ అయినా ఏడాదికాలం జట్టుకు దూర‌మైన అత‌డి జెర్నీ నంబ‌ర్‌ను కొత్త‌వాళ్ల‌కు ఇవ్వం. అప్పుడు అరంగేట్రం చేసేవాళ్ల‌కు 30 నంబ‌ర్ల‌లో ఒక‌టి ఎంచుకోవాల్సి వ‌స్తుంది’ అని ఆ అధికారి వివరించారు.
 
కెరీర్ తొలి నాళ్లలో పేసర్ శార్దుల్ ఠాకూర్ పదో నంబర్ జెర్సీని ధరించాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడిచింది. దీంతో పదో నెంబర్ జెర్సీ రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏడో నెంబర్ జెర్సీ విషయంలో బోర్డు జాగ్రత్తపడింది.  మిగతా ఆటగాళ్లెవరకూ ఆ నెంబర్ జెర్సీని అందుబాటులో ఉండకుండా చూసుకుంది.