కాంగ్రెస్ ఎంపి ఇంట్లో నేలమాళిగపై ఐటి ద్రుష్టి

* మొత్తం రూ. 465 కోట్ల నగదు 3 బస్తాల బంగారం స్వాధీనం

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బౌధ్ డిస్టిలరీల యజమాని ధీరజ్ సాహు నివాసంలో సోదాలను ఆదాయం పన్ను శాఖ ఉధృతం చేసింది. భూగర్భంలో ఏవైనా నిధులను దాచిపెట్టారా? అన్న కోణంలో ఆలోచిస్తున్న అధికారులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జిపిఆర్)ను ఉపయోగిస్తూ తమ సోదాలను కొనసాగిస్తున్నారు. 

చిన్న రంధ్రం పెట్టడం ద్వారా భూమిలోపలకు రేఢియో తరంగాలను పంపి అక్కడి ఫోటోలను తీయడం జిపిఆర్ విధానంలో జరుగుతుంది. నేలను తవ్వకుండా నేలమాళిగ (భూ గర్భంలో)లో ఉన్న వస్తువులను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. సాధారణంగా ఈ యంత్రాన్ని భూమిలోపల నిక్షిప్తమైన బొగ్గు లేదా ఇతర ఖనిజాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. 

ఏదైనా వస్తువు లేదా ఖనిజం కచ్ఛితంగా భూమి లోపల ఎంత దూరంలో ఉందో దీని ద్వారా గుర్తించవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కాగా ఐదు రోజుల పాటు వరుసగా సోదాలు నిర్వహించిన ఐటి అధికారులు జార్ఖండ్, ఒడిశాలోని ధీరజ్ సాహుకు చెందిన ప్రాంగణాల నుంచి రూ. 354 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

ఒడిశాలోని బోలంగిర్‌లో బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన కార్యాలయంలోని తొమ్మిది బీరువాల నుంచి రూ. 354 కోట్ల నగదు లభించింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఊహిస్తున్న కాంగ్రెస్ ఎంపి ఎమ్మెల్యేల బేరసారాల కోసం ఈ ధనాన్ని దాచి ఉంచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మరి కొన్ని ఇతర ప్రాంగణాల నుంచి కూడా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు బస్లాలలో దాచిన బంగారు నగలు, విలువైన పత్రాలను కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదును లెక్కించడానికి మూడు బ్యాంకులకు చెందిన దాదాపు 50 మంది సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది.

సాహుకు చెందిన ప్రాంగణాల నుంచి మొత్తం రూ. 465 కోట్ల నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అనధికార వార్తలు చెబుతున్నాయి. జార్ఖండ్‌లోని లోహర్‌దాగా నివాసి అయిన ధీరజ్ సాహు 1977లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మూడవ పర్యాయం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.