లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా

* నిందితులకు పాస్‌ల జారీపై వివరణ
 
కర్ణాటకలోని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా గురువారం ఉదయం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. పార్లమెంట్‌ భద్రతను ఉల్లంఘించిన నిందితులకు పాస్‌లు జారీ చేయడంపై వివరణ ఇచ్చారు. నిందితుల్లో ఒకరి తండ్రి తనను కలిసినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా తెలిపారు.  తన కుమారుడు కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించాలనుకుంటున్నాడని ఆయన కోరినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో నిందితుడు సాగర్ శర్మ సందర్శకుల పాస్‌ కోసం తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ), కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.  ఇంతకు మించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన వివరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  కాగా, బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా ద్వారా విజిటర్స్‌ పాసులు పొందిన సాగర్ శర్మ, మనోరంజన్ బుధవారం విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకారు. 
 
పసుపు రంగు పొగ విడుదల చేసి సభ్యులను భయ భ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన ఎంపీలు వారిద్దరిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ మేరకు పార్లమెంట్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. నిన్నటి ఘటనతో ప్రస్తుతం పార్లమెంట్‌ సముదాయానికి సందర్శకులు రాకుండా ప్రభుత్వం నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోకి సందర్శకుల అనుమతులను తక్షణం రద్దు చేశారు. 

పార్లమెంట్‌లోకి సందర్శకులు రావడాన్ని అనుమతిస్తే.. ఇక నుంచి వారు పాత గేటు నుంచి లోపలికి ప్రవేశించలేరు. విజిటర్స్‌కు నాలుగో గేటు నుంచి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించేలా కొత్త నియమాలు తీసుకువచ్చారు.