విశాఖలో నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ ఆగ్రహం

విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ జంక్షన్ మూసివేశారని ఆరోపిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సోమవారం విశాఖపట్టణంలో టైకూన్ కూడలి వద్దకు బయలుదేరిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
 
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి ఏపీలో ఉందని మనోహర్ ధ్వజమెత్తారు. విశాఖ వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసివేసి, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకున్న నాదెండ్ల మనోహర్ ను కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని జనసేన నేతలు ఆరోపించారు. మనోహర్ పాటు పార్టీ నాయకులను బయటకు వెళ్లనీయకుండా హోటల్ గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు.  శాంతియుతంగా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఫుట్ పాత్ మీద అయినా ప్రజా సమస్యపై నిరసన తెలుపుతామని మనోహర్ అసిస్టెంట్ కమిషనర్ కు వివరించినా పోలీసులు అందుకు అంగీకరించలేదని జనసేన నేతలు తెలిపారు. దానితో మనోహర్ హోటల్ వద్ద నిరసన తెలిపారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం అత్యంత దారుణం అంటూ మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వ్యవస్థలను ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉపయోగించుకుంటుందో అర్థమవుతుందని మండిపడ్డారు.   విశాఖలోని లక్షలాది మందికి ఎంతో అవసరమైన కూడలిని మూసివేసి, రెండు కిలోమీటర్ల దూరం పెంచి చుట్టూ తిరిగి రావాలనేలా ప్రజల సమయంతో ప్రభుత్వ పెద్దలు ఆటలాడుతున్నారని విమర్శించారు.

విశాఖలోని టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ ను, జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని, ప్రజల తరఫున పోరాడతానని హెచ్చరించారు.