గుంటూరు మున్సిపల్ కమిషన్ కు జైలు శిక్ష, జరిమానా

గుంటూరు మున్సిపల్ కమిషన్ కు జైలు శిక్ష, జరిమానా
ఏపీలో ఇటీవల తరచూ ప్రభుత్వ అధికారులు హైకోర్టు ఆగ్రహానికి గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలులో నిర్లక్ష్యం కారణంగా కోర్టు అధికారులకు జైలు శిక్ష, జరిమానాలు విధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు గుంటూరు మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష విధించింది. 
 
కోర్టు ఆదేశాలు అమలు చేయలేదన్న కారణాలతో గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ధర్మాసనం నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.  గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రంలో ఎటువంటి లీజ్ చెల్లించకుండా పాఠశాలను నడుపుతున్నారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్‌లకు రూ.25 లక్షలు చెల్లించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల అమలులో మున్సిపల్ కమిషనర్‌ నిర్లక్ష్యం వహించారు. దీంతో పిటిషనర్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. 
 
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.