రాజస్తాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను బీజేపీ ఎంపిక చేసింది. భజన్ లాల్ తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. ప్రస్తుతం ఆయన సాంగ్నర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తవ్డే, సంజయ్ పాండే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీపీ జోషి, మాజీ సీఎం వసుంధర రాజే సింధియా తదితర నాయకులు జైపూర్‌లో జరిగిన బీజేఎల్పీ సమావేశానికి హాజరయ్యారు.
 
దీంతో ఇటీవల ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త వ్యక్తులనే ముఖ్యమంత్రులుగా నియమించినట్టయ్యింది. జైపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు.

ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ప్రతిపాదించగా కిరోరీ మీనా, మదన్ దిలావర్, జవార్ సింగ్ బలపరిచారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన దియా కుమారితోపాటు ప్రేమ్ చంద్ బైర్వా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రివర్గంలో కొనసాగుతారు. అసెంబ్లీ స్పీకర్ గా వాసుదేవ్ దేవ్నానీ వ్యవహరిస్తారు. 

వసుంధర రాజేతో పాటు దియాకుమారి, కిరోరి లాల్ మీనా, బాలక్ నాథ్.. తదితరులు కూడా సీఎం రేసులో ఉన్నారు. కానీ, అనూహ్యంగా భజన్ లాల్ ను పార్టీ ఎంపిక చేసింది. 200 స్థానాల రాజస్తాన్ అసెంబ్లీలో 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 115 సీట్లను బీజేపీ గెల్చుకుని అధికారంలోకి వచ్చింది.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న భజన్‌లాల్ శర్మ.. జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర జీ భరద్వాజ్‌పై 48 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే, నాలుగు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.  56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. భరత్‌పూర్‌ నుంచి శర్మ తొలుత టిక్కెట్ ఆశించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో దీనికి బదులు సంగనేరు టిక్కెట్ కేటాయించారు.