జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.
భారతదేశంలో కలిసినపుడు కశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని వ్యాఖ్యానించింది. అప్పట్లో జమ్మూకశ్మీర్ లో ఉన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగానే ఆర్టికల్ 370 ని ఏర్పాటు చేశారని పేర్కొంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు.
రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కశ్మీర్ కూడా సమానమేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మిగతా రాష్ట్రాలకు లేని ప్రత్యేక ప్రతిపత్తి కశ్మీర్ కు మాత్రమే ఉండదని పేర్కొంటూ రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్కు వర్తిస్తాయని తెలిపింది.
మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ సమానమే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సీజేఐ తెలిపారు.
ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై రాష్ట్రపతి ప్రకటన చేశారని ధర్మాసనం గుర్తుచేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని, రాష్ట్రపతి ప్రకటనను కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్ గా ఏర్పడి ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఆగస్టులో దాఖలైన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి తాజాగా తీర్పు వెలువరించింది.
ఇదిలావుంచితే, ఆర్టికల్ 370పై తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో కేంద్రం అలర్ట్ ప్రకటించింది. భద్రతాబలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. శాంతికి విఘాతం కలిగించే పనులను అడ్డుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలని బీజేపీ పిలుపునిచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!