విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వేస్టేషన్ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఏపీ పర్యటనలో ఉన్న మంత్రి వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా శనివారం అశ్వినీ వైష్ణవ్ విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తిలో శనివారం పర్యటించారు.
ఇక కేకే లైన్గా పిలిచే కొత్తవలస కిరండోల్ లైన్ను కూడా డబుల్ లైన్గా మార్చనున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మరిన్ని రైళ్లు ఆ మార్గంలో నడుస్తాయని రైల్వే మంత్రి వివరించారు. కాశీ వెళ్లే రైలును ఎస్.కోట మీదుగా నడుపుతామన్న రైల్వేశాఖ మంత్రి విశాఖ బెనారస్ రైళ్ల ఫ్రీకెన్సీని పెంచనున్నట్లు తెలిపారు.
కాగా, మానవ తప్పిదం వల్లే విజయనగరం జిల్లా కంటకాపల్లిలో ఇటీవల రైలు ప్రమాదం సంభవించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రూ.20 కోట్లతో రైల్వే శాఖ విశాఖ జిల్లా సింహాచలం రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయని చెబుతూ వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రైల్వేను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దని ఆయన కోరారు.ఎపిలో రైల్వేల అభివృద్ధికి రూ.8,406 కోట్లను ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైల్వే మంత్రి కోరారు.
దేశంలో 5జి మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోందని చెబుతూ దీపావళికి బిఎస్ఎన్ఎల్ 5జి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నాలుగు వేల సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. అందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
బీజేపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చినట్లు వివరించారు. ఉజ్వల్ పథకం కింద అర్హులైన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామన్న కేంద్రమంత్రి కరోనా సమయంలో కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. రేషన్ పంపిణీతో పాటుగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు మంచినీటి కోసం పలుప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడేవారన్న ఆయన మోదీ వచ్చాక ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటిని అందించే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఇక ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డు ద్వారా పేదలకు ఐదు లక్షల వరకూ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వీలుపర్తిలో నిక్షరు మిత్ర కింద టి.బి.రోగులకు పౌష్టికాహారాన్ని, పిఎం ఉజ్వల యోజన కింద పలువురు లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను అందజేశారు.
More Stories
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’