సహజీవనం అత్యంత ప్రమాదకర రోగం, కాటేసే సర్పం

సహజీవన బంధం అత్యంత ప్రమాదకర రోగం, కాటేసే సర్పం అని బిజెపి ఎంపి ధరంవీర్ సింగ్ గురువారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. వైవాహిక బంధం లేకుండా కలిసి జీవించే ప్రక్రియ వల్ల తలెత్తుతున్న అనర్థాలను గుర్తించి వెంటనే వీటిని సమాజంలో నుంచి తొలిగించాల్సి ఉందని ఆయన తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ సహజజీవన నిషేధానికి చట్టం తీసుకురావల్సి ఉందని హర్యానాకు చెందిన ఈ ఎంపి డిమాండ్ చేశారు. సామాజికంగా ఈ సహజీవన పరిణామం ఎంతకు కోలుకోలేని స్థాయి దెబ్బను తీసే జబ్బు అవుతోందని, సామాజిక విలువలకు ఇది భంగకరం అవుతోందని ఆయన హెచ్చరించారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ ఎంపి ఈ విషయం ప్రస్తావించారు.

ఇటువంటి సంబంధాలు పాశ్చాత్య దేశాలలో సాధారణంగా నెలకొంటున్నా మనదేశంలో కూడా వేగంగా వృద్ధి చెందుతూ దారుణమైన పరిణామాలకు కారణం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీలో తనతో సహజీవనం కావిస్తున్న మహిళను దారుణంగా ముక్కలు ముక్కలుగా కోసివేసిన శ్రద్ధ (వాల్కర్) ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

సామాజికంగా తలెత్తుతున్న కొన్ని పరిణామాలు భారతీయ విలువలను దెబ్బతీస్తున్నాయని, ఇవి భవిష్య తరాలకు ముప్పు తెచ్చిపెడుతాయని ఆయన హెచ్చరించారు. ఇటువంటి సంబంధాలు మన సంస్కృతికి చేటు తీసుకు రావడమే కాకుండా, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన చెప్పారు.

ప్రేమవివాహాలను తాము కాదనడం లేదని, అయితే ఇటువంటి పెళ్లిళ్లలోనే ఎక్కువగా విడాకులు చోటుచేసుకుంటున్నాయని చెబుతూ ఇది తీవ్రస్థాయి విషయం అని పేర్కొన్నారు. ప్రేమ వివాహాలు చాలా గ్రామాలలో సామజిక ఘర్షణలకు దారితీస్తున్న కారణంగా అందుకు తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకు రావలసి ఉందని ఆయన చెప్పారు. 

ఇటువంటి ఘర్షణలతో అనేక కుటుంబాలు ధ్వంసం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన చట్టం ద్వారా సామాజిక రుగ్మతలకు కళ్లెం వేయాల్సి ఉందని  ధరంవీర్ సింగ్ సూచించారు.  పెళ్లిళ్లు ఎటువంటివి అయినా వాటికి ముందు వధూవరుల తల్లిదండ్రుల నుంచి అనుమతి తప్పనిసరి చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. 

బిజెపి ప్రభుత్వం వసుధైక కుటుంబం పాలసీని పాటిస్తోంది. సహోదరత్వాన్ని చాటుతోంది. ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో వెర్రితలలు వేసే పద్ధతులు అక్కడ పాతవే కావచ్చు. అయితే భారతీయ సాంప్రదాయాలకు, విలువలకు ఇవి అనుగుణంగా ఉండవని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం, ఇతర విలువలకు కట్టుబడి భారతదేశం వ్యవహరిస్తుంది. దీనికి భంగకరంగా ఉండే ఎటువంటి వైఖరి అయినా ఆదిలోనే అంతం కావల్సి ఉంటుందని భివానీ మహేందర్ గఢ్‌కు చెందిన ఈ ఎంపి తేల్చి చెప్పారు.