మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణస్వీకారం

మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అధినేత లాల్దుహోమా ప్రమాణస్వీకారం చేశారు. ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో  గవర్నర్ కె హరిబాబు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా 11 మంది జెడ్‌పీఎం ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణం చేశారు. 

ఇటీవలే జ‌రిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 స్థానాల‌కు గానూ 27 నియోజ‌క‌వ‌ర్గాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ తెలుపొందింది. పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి జోరంతంగా కూడా హాజరయ్యారు. ఎంఎన్‌ఎఫ్ శాసనసభా పక్ష నేత లాల్‌చందమా రాల్టేతో సహా ఎమ్మెల్యేలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కూడా అక్కడే ఉన్నారు.

మంగళవారం జెడ్పీఎం శాసనసభా పక్ష నాయకుడిగా లల్దుహోమ, ఉపనేతగా కె.సప్దంగ ఎన్నికయ్యారు.  2019లో రాజకీయ పార్టీగానమోదయిన జెడ్‌పీఎం 2018 ఎన్నికలలో 8 నుండి దాని సంఖ్యను పెంచుకుని, 27 స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.

74 ఏండ్ల వ‌య‌సున్న లాల్దుహోమా ఐపీఎస్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. గోవా, ఢిల్లీలో ఆయ‌న ఐపీఎస్‌గా ప‌ని చేశారు.  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంచార్జి ఆఫీస‌ర్‌గా కూడా ప‌ని చేశారు. అదే స‌మ‌యంలో రాజ‌కీయాలకు ఆక‌ర్షితుడైన లాల్దుహోమా త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 1984లో లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ‌స్వీకారం చేశారు.