నౌకాదళ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ

భారత దేశానికి నౌకాదళ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. సోమవారం మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో నేవీ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటూ ముందుగా భారత నౌకాదళ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 

”నేవీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సింధుదుర్గ్‌ కోట నుండి నేవీ డే శుభాకాంక్షలు తెలియజేయడం నా అదృష్టం. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి సముద్రపు శక్తి, ప్రాముఖ్యత తెలుసు. సాయుధ బలగాలలో మన మహిళా శక్తిని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు. నావికాదళంలో ర్యాంకుల పేర్లను భారతీయ సంస్కృతికి అనుగుణంగా మారుస్తామని ప్రధాని ప్రకటించారు.

రక్షణ దళాలలో మహిళా శక్తిని పెంచడానికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ మొదటి మహిళా కమాండింగ్‌ అధికారిని నియమించినందుకు నావికాదళాన్ని ఆయన అభినందించారు.  నేడు, భారతదేశం తనకుతానుగా పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటుందని, ఆ లక్ష్యాలను సాధించడానికి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తోందని మోదీ చెప్పారు.

నీలి విప్లవం గురించి మాట్లాడుతూ, బ్లూ ఎకానమీకి, పోర్ట్‌ ఆధారిత అభివృద్ధికి భారతదేశం అపూర్వమైన మద్దతు ఇస్తోందని తెలిపారు.  మర్చంట్‌ షిప్పింగ్‌ను కూడా ప్రోత్సహిస్తున్నామని, భారతదేశం తన మహాసముద్రాల సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ రోజు భారతదేశం అద్భుతమైన లక్ష్యాలను నిర్దేశిస్తోందని, దేశానికి అద్భుతమైన విజయాల చరిత్ర ఉందని తెలిపారు. అంతకుముందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.