ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై పడిన సస్పెన్షన్ వేటును రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖఢ్ సోమవారంనాడు రద్దు చేశారు. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
సభా కార్యక్రమాలకు హాజరుకాకుండా విధించిన సస్పెన్షన్ కారణంగా ఇంతవరకూ ఆయనకు పడిన శిక్ష సరిపోతుందని, ఇవాల్టి నుంచి ఆయన సస్పెన్షన్ రద్దు చేసే విషయాన్ని సభ పరిశీలించాలని ఆ తీర్మానంలో ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సస్పెన్షన్ను రద్దు చేయాలని రాజ్యసభ చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై రాఘవ్ చద్దా సంతోషం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టుకు, రాజ్యసభ చైర్మన్ ధన్ఖఢ్కు కృతజ్ఞతలు తెలిపారు. 115 రోజుల సస్పెన్షన్ కాలంలో తనను ఆదరించి, ఆశీస్సులు ఇచ్చిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తాను సాగిస్తున్న పోరాటానికి అందరూ ధైర్యం ఇచ్చారని తెలిపారు.
గత ఆగస్టు 11న రాఘవ్ చద్దా పార్లమెంటు నుంచి సస్పెండయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ (సవరణ)-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బేషరతు క్షమాపణకు ఆయన అంగీకరించడంతో ఆయన క్షమాపణను సానుకూలంగా పరిశీలించాలని రాజ్యసభ చైర్మన్కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్