ఓటమి కోపం పార్లమెంట్‌లో చూపించవద్దు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్ తన కోపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ హితవు చెప్పారు.  పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో సోమవారం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్ లో చర్చకు రావాలని కోరారు.
 
నిన్న విడుదలైన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లను హస్తగతం చేసుకుంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాల్లో ఘోర ఓటమి తరువాత కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
 
దీనిపై ప్రధాని స్పందిస్తూ 9 ఏళ్ల నుంచి బీజేపీని తిట్టడమే ప్రతిపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని, త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇకనైనా సానుకూలంగా ఉండాలని కోరారు. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగాలని, ప్రతికూల ధోరణిని వదిలేయాలని సూచించారు. 
 
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెబుతూ ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారికే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.
 
ఎన్నికల ఫలితాల ఆగ్రహం చర్చలపై ప్రభావం చూపకూడదని పేర్కొంటూ పరాజయాన్ని స్వీకరించి సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. అప్పుడే సభ్యులను దేశం చూసే దృష్టి కోణం మారుతుందని మోదీ వివరించారు. భారత్ మరింత పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,  పేర్కొంటూ విపక్షాలను కలుపుకొని పోతామని భరోసా ఇచ్చారు. 
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కేంద్రంగా పార్లమెంట్లు విలసిల్లాలని ప్రధాని కోరారు. వికసిత భారత్ మరింత పురోభివృద్ధికి పాటుపడాలని చెబుతూ పార్లమెంటులో బిల్లులపై జరిగే చర్చల్లో విపక్షాలు పాల్గొన్నాలని సూచించారు. చర్చలు సజావుగా సాగకపోతే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేరని స్పష్టం చేశారు.

కొత్త పార్లమెంటు భవనంలో సుదీర్ఘ కాలం కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొంటూ కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చని చెప్పారు. లోటుపాట్లపై సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేయాల్సి వస్తుందని మోదీ చెప్పారు. భారత్ మరింత పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విపక్షాలను కలుపుకొని పోతామని స్పష్టం చేశారు.