టిఎంసి ఎంపీ మహువా మొయిత్రాపై వేటుకు రంగం సిద్ధం!

పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు డబ్బులు అడిగారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ, అదానీకి వ్యతిరేకంగా మహువా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన నివేదికను లోక్‌సభకు సమర్పించనుంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం (డిసెంబర్‌ 4న) ఎథిక్స్‌ కమిటీ తన నివేదికను లోక్‌సభ ముందు పెట్టనుంది. ఆ నివేదికలో సూచన మేరకు కేంద్రం మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేసే అవకాశం ఉన్నది. నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్సమావేశమై మహువాను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని చేసిన సిఫారసును ఆమోదించింది.

తాజాగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఈ నివేదికను సమర్పించింది. పార్లమెంట్‌ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్‌ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. కాగా వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారని గత నెలలో దూబే ఆరోపించారు.

వ్యాపారవేత్త హీరానందానీ కూడా పార్లమెంట్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ అంశంపై దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు కమిటీ ముందు హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. నవంబర్‌ 2న లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ ముందు విచారణకు హాజరైన మహువా ప్యానెల్‌ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారని ఆగ్రహించి విచారణ మధ్యలోనే వెళ్లిపోయింది. 

అనంతరం మహువా కేసులో ఎథిక్స్‌ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఆ తర్వాత 6:4 నిష్పత్తితో ఈ నివేదికను ఎథిక్స్‌ కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది.  మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్‌ లాగిన్‌ ఐడీని షేర్‌ చేసుకున్నారని, దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించింది. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసింది.