ఏపీ సహా మూడు రాష్ట్రాలకు తుఫాను ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలపడినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరికి 730 కి.మీ , చెన్నైకి 740 కి.మీ, నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930 కి.మీ, మచిలీపట్నానికి 910 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. 
 
ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడుతుందని చెప్పారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 
 
తుపాను ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఆది, సోమవారం తేదీల్లో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. 
 
ఇక ఏపీలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, అనకాపల్లి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరించారు.
 
తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.
 
సోమవారం వరకు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ  హెచ్చరించింది. చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో.. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం నాడు చెన్నై, కంచీపురం, రాణిపేట్​, చెంగల్​పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మయిలదుథురై జిల్లాలు సహా పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. సోమవారం మాత్రం తమిళనాడు వ్యాప్తంగా అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది