“ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన” వినియోగించుకోండి

కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3,  తేదీల్లో దేశవ్యాప్తంగా  తలపెట్టిన  “ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన” కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని, సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో ఓటర్లు భాగస్వాములు కావాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధానకార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపు ఇచ్చారు
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులు డిసెంబర్ 2, 3 తేదీల్లో  పోలింగు బూతులవద్ద  ఓటర్ల జాబితాల పరిశీలన చేపడతారని, ఓటర్లు అప్రమత్తంగా ఉంటూ చేర్పులు, మార్పులు, తొలగింపులు, సక్రమంగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలని రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును  వినిగించుకోవడానికి సక్రమమైన ఓటర్ల జాబితాలు కీలకమని ఆయన  పేర్కొన్నారు.
 
ఓటర్ల జాబితాల పరిశీలనకు బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ బూత్ లలో ఉన్న సమయంలో ఓటర్లు తప్పనిసరిగా బూత్ లకు వెళ్ళాలని డా. రమేష్ కుమార్ ఓ ప్రకటనలో సూచించారు. బూత్ లెవెల్ అధికారుల వద్దకు వెళ్ళే సమయంలో  నిబంధనల  మేరకు నివాస ధృవపత్రం సహా అన్ని రకాల పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆయన కోరారు.
జాబితాలో తమ పేర్లు గానీ, కుటుంబ సభ్యులపేర్లు గానీ  లేనిపక్షంలో ఫారం 6 ను సమర్పించాలని, తమ ఇంటి నంబరులో కుటుంబానికి సంబంధంలేని వ్యక్తులపేర్లు ఉంటే వాటి తొలగింపు కోసం ఫారం 7 ను సమర్పించాలని, కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు బూత్ లలో చెల్లా చెదురుగా నమోదై ఉంటే, వారు  ఒకే బూత్ జాబితాలోకి మార్చేందుకు ఫారం 8 సమర్పించాలని డా.రమేష్ కుమార్ సూచించారు. 
 
సమర్పించిన ఫారాలకు తగిన రసీదు కూడా పొందాలని కూడా ఆయన సూచించారు. రాష్ట్రంలో ఫారం 7 ను దుర్వినియోగం చేసి పలువురు అసలైన ఓటర్ల పేర్లను జాబితాల నుండి తొలగించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, అందులో    మూకుమ్మడి దరఖాస్తులు కూడా ఉన్నాయని ఆయన ఆ ప్రకటన లో గుర్తు చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం మూకుమ్మడి  తొలగింపుల పరిశీలన కోసం ప్రతి నియోజకవర్గంలో  ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ  ఉంటుందని, ఆ కమిటీ ఆమోదం తోనే తొలగింపులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంటూ ఈ విషయాన్ని ఓటర్లు , వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు గమనంలో ఉంచుకోవాలని ఆయన చెప్పారు. 
నివాస గృహంలో ఉండటం లేదన్న పేరుతో  ఓటర్ల పేర్లను అధికారులు పెద్ద ఎత్తున తొలగిస్తున్న ధోరణి కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. కరోనా అనంతరం ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల కోసం స్వగ్రామాల నుండి, ఇంటి నుండి  పని చేస్తున్నారని వారి పని పరిస్థితుల ఆధారంగా ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అధికారుల అజాగ్రత్త కారణంగా ఓటు హక్కును కోల్పోయినట్లైతే అటువంటి ఓటర్లు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కును తిరిగి  పొందవచ్చునని ఆయన సూచించారు.