ఢిల్లీ సీఎస్ పదవీకాలం పొడిగింపుకు `సుప్రీం’ ఆమోదం

ఢిల్లీ ప్రధాన కార్యదర్శి పదవి కాలం గడువు పొడిగింపును సుప్రీంకోర్టు బుధవారం సమర్ధించింది.  పదవీకాలం పొడిగింపు విషయం కేంద్రం , ఆప్ ప్రభుత్వం మధ్య వివాదంకు దారితీసింది. ఢిల్లీలో పోలీసు, భూ వ్యవహారాలు, ప్రజా భద్రత వంటి విషయాల పర్యవేక్షణ బాధ్యత ప్రధాన కార్యదర్శిపై ఉంటుంది.  ప్రధాన కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఇందులో ఎటువంటి మీమాసంకు వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ పరిణామం కేజ్రీవాల్ సారధ్యపు ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అయింది.  ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ , న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. నిజానికి ఈ నియామక గడువు పరిమితి ఈ నెల చివరి నాటికి అంటే 30 వ తేదీ నాటికి ముగియాలి.

పొడిగింపను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. తీర్పు వెలువరించింది. పూర్తి స్థాయిలో చట్టపరమైన, రాజ్యాంగపరమైన సూత్రాలను విశ్లేషించిన తరువాత తీర్పును వెలువరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.  ప్రాధమిక అంశాలను, ఇంతకు ముందటి తీర్పులను పరిశీలించిన తరువాత ఇప్పుడీ రూలింగ్ ఇస్తున్నట్లు తెలిపింది.

విచారణ దశలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వెంకటరమణి స్పందిస్తూ పూర్తిస్థాయి సిఎస్ నియామకం జరిగే వరకూ ఇప్పటి సిఎస్ అధికారంలో ఉంటారని, ఇది తాత్కాలిక ప్రక్రియనే అని వివరించారు.  అయితే, ఇప్పుడున్న సిఎస్ పదవీకాలాన్ని పొడిగించడం వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది అనుమానాలకు దారితీస్తోందని, దీనిని కేంద్రం నివృత్తి చేసుకుని తీరాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.