అన్న యోజన పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి సమయంలో తీసుకొచ్చిన ఉచిత రేషన్ పథకం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఓవై) పధకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. 
 
ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు నవంబర్ 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది.  ఉచిత రేషన్ పథకం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 
 
జనవరి 1, 2024 నుంచి ఈ పొడిగింపు వర్తిస్తుందని తెలిపారు. డిసెంబర్, 2028 వరకు పేద ప్రజలకు కేంద్ర సర్కార్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుందని చెప్పారు. ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
తాజాగా కేంద్ర కేబినెట్ ఆ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. పీఎంజీకేఓవై పథకాన్ని ఏప్రిల్ 2020లో కరోనా మహమ్మారి లాక్ డౌన్ విధించిన క్రమంలో ప్రకటించింది కేంద్రం. మొదట మూడు నెలలు మాత్రమే ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ తెచ్చారు. ఈ పథకం ద్వారా నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత పలు మార్లు ఈ స్కీమ్ పొడిగించింది కేంద్రం. 
 
ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం డిసెంబర్ 2023 లో అంటే వచ్చే నెలలో గడువు ముగియనుంది. ఇప్పుడు కేంద్ర సర్కార్ 5 సంవత్సరాల పాటు పొడిగింపు నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రజలు డిసెంబర్ 2028 వరకు ఈ పథకం ప్రయోజనాలను పొందడం కొనసాగిస్తారు.