మానవత్వం, టీమ్‌వర్క్‌కు అద్భుత నిదర్శనం

* సొరంగం నుండి కార్మికుల క్షేమం పట్ల ప్రధాని, రాష్ట్రపతి హర్షం

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుపడిన కార్మికులను కాపాడడానికి సహాయక బృందాలు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘ఉత్తరకాశిలో మన సోదరులు చేపట్టిన రెస్కూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. మీ ధైర్యం, ఓపిక ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని టన్నెల్‌లో చిక్కుపడిన సోదరులకు చెప్పదలచుకున్నా. అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ‘ఎక్స్’లో ఉంచిన పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. 

దీర్ఘకాలం వేచి ఉన్న తర్వాత ఈ సోదరులు ఇప్పుడు తమ ఆప్తులను కలుసుకోవడం గొప్ప సంతృప్తినిస్తోందని ప్రధాని చెప్పారు. ఈ సంక్షుభిత సమయంలో ఆ కుటుంబాలన్నీ ప్రదర్శించిన సహనం, ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువేనని కూడా ప్రధాని తెలిపారు. క్షేమంగా బైటకు వచ్చిన కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి వారి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. 

కాగా ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికలుందరినీ క్షేమంగా కాపాడిన విషయం తెలిసి తనకు ఎంతో సంతోషం, ఊరట కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు. ఉత్తర కాశీలోని సొరంగంలో చిక్కుపడిన 41 మంది శ్రామిక సోదరులను క్షేమంగా, భద్రంగా బయటికి తీసుకు రావడం దేశప్రజలందరికీ గొప్ప వార్త అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కార్మికులందరినీ క్షేమంగా బయటికి తీసుకు రావడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గత కొన్ని రోజులుగా ఘటనాస్థలి వద్దే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ వచ్చారు.కార్మికులతోను, వారి కుటుంబ సభ్యులతోను మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతూ వచ్చారు. కూలీలందరూ క్షేమంగా బయటపడాలని చేసిన ప్రార్థనలు ఫలించాయని కూలీలు బయటికి వచ్చిన అనంతరం విలేఖరులతో ధామి చెప్పారు.

మొట్టమొదటగా బయటికి తీసుకువచ్చిన కార్మికుడిని ధామి ఆప్యాయంగా హత్తుకుని స్వాగతం పలికారు. కూలీలంతా క్షేమంగా బయటపడినందుకు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి ధామికి, సహాయక బృంద సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.