అమెరికా దర్యాప్తునకు ఒకే.. నిజ్జర్ హత్య కేసులో కెనడాకు మాత్రం నో

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిన కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్‌ కుమార్‌ వర్మ  తెలిపారు. కానీ నిజ్జర్ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. 
 
భారత్‌తో సమాచారం పంచుకునే విషయంలో రెండు దేశాల మధ్య తేడా ఉన్నదని, ఆ కారణంగానే భారత ప్రభుత్వం స్పందన కూడా వారి విషయంలో భిన్నంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.  కెనడాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్‌ కుమార్‌ వర్మ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు పన్నూ హత్యకు కుట్ర కేసులో దర్యాప్తునకు సంబంధించి అమెరికా అధికారులు భారత్‌తో నిర్దిష్టమైన సమాచారాన్ని పంచుకుందని చెప్పారు. 
 
అమెరికాలోని గ్యాంగ్‌స్టర్‌లు, మాదకద్రవ్యాల రవాణాదారులు, ఉగ్రవాదుల గురించి ఆ దేశం కీలక సమాచారం అందించిందని, ఈ కుట్రలో భారత్‌లోని వారికి సంబంధం ఉండొచ్చని అమెరికా భావిస్తోందని తెలిపారు. ఇక్కడ భారత్‌లోని వారికి సంబంధం అంటే ప్రభుత్వానికి అని కాదని ఆయన స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల్లో ఎవరో ఒకరికి అని అర్థం అని పేర్కొన్నారు. 
 
న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని సంజయ్‌ వర్మ చెప్పారు. అదేవిధంగా ఇక నిజ్జర్‌ కేసు విషయానికొస్తే దీని దర్యాప్తునకు సంబంధించి కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం లేదా ఆధారాలు అందలేదని గుర్తు చేశారు. 
 
`కేసు గురించి ఎలాంటి వివరాలు లేనప్పుడు మేం దానిపై ఎలా స్పందించగలం? అందుకే ఆధారాలివ్వండని మేం అడుగుతున్నాం. ఆ సమాచారం ఇవ్వనంత వరకు కెనడా దర్యాప్తుపై మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఈ రెండు కేసుల్లో భారత స్పందన భిన్నంగా ఉండటానికి కారణమిదే’ అని ఆయన తెలిపారు.కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు జరిగిన కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ ఘటనకు సంబంధించి భారత్‌తో అమెరికా చర్చించింది. దీనిపై ఇటీవల భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అమెరికా పంచుకున్న సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని తెలిపింది. 

అదేవిధంగా ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధారమైన, కుట్రపూరిత ఆరోపణలేనని కొట్టిపారేసింది.